ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం
హైదరాబాద్: తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు..
దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష మిగులుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ వస్తుందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవీ పాలసీ వివరాలను మంత్రి వెల్లడించారు.
''జీవో 41 ద్వారా తీసుకువచ్చిన ఈవీ పాలసీ 2026 వరకు ఉంటుంది. టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్పోర్టు బస్సులకు వందశాతం పన్ను మినహాయింపు. జంట నగరాల్లో ఈవీ బస్సులు తీసుకొస్తున్నాం. దిల్లీ మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం రాకుండా ఉండేందుకే ఈవీ పాలసీ తీసుకొచ్చాం. ప్రజలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలి'' అని మంత్రి పొన్నం కోరారు.