జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్..

హైదరాబాద్:అక్టోబర్ 28
కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, ఖైరతాబాద్‌ అభ్యర్థిగా పీజేఆర్‌ కుమార్తె పి.విజయారెడ్డికి అవకాశం కల్పించారు.

పీజేఆర్‌ కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్ఠానం తర్జన భర్జన పడింది. జూబ్లీహిల్స్‌ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్‌ నుంచి పి.విజయారెడ్డి దివంగత నేత కుటుంబం నుంచి టికెట్‌ ఆశించారు.

వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై స్ర్కీనింగ్‌ కమిటీ పలుమార్లు బైఠాయించింది. చివరకు విజయారెడ్డి వైపే మొగ్గు చూపించింది. ఖైరతాబాద్‌ నుంచి పి.విజయారెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తూ వచ్చారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలగజేసుకొని రోహిణ్‌రెడ్డిని అంబర్‌పేట నుంచి పోటీ చేసేలా ఒప్పించారు. దీంతో విజయారెడ్డికి మార్గం సుగమమం అయింది. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో అసమ్మతికి కూడా చెక్‌ పెట్టినట్టు అయింది.

ఇక జూబ్లీహిల్స్‌ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పేరు పరిశీలనకు వచ్చింది. మొదట విష్ణుకే టికెట్‌ వస్తుందని అందరూ భావించారు. పార్టీ విషయంలో ఆయన నిర్లక్ష్య ధోరణిని అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకుంది.

పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్‌ ఎలా ఇస్తారనే వాదనలు వెల్లువెత్తాయి. దీంతో విష్ణుకు చెక్‌ పెడుతూ అజారుద్దీన్‌ పేరును ఖరారు చేశారు. విష్ణుకు చెందిన ఓ సన్నిహిత వర్గం అజారుద్దీన్‌ వైపు మొగ్గు చూపించింది. విష్ణు నాయకత్వం వద్దంటూ అధిష్ఠానంను కలిసింది.

అవన్నీ పరిగణలోకి తీసుకోవడంతోపాటు నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధిష్ఠానం అజారుద్దీన్‌ పేరు ప్రకటించింది. నియోజకవర్గంలో తలెత్తే అసమ్మతి విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Post a Comment

Previous Post Next Post