సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపణ

హైదరాబాద్‌: సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్‌ట్యాపింగ్‌పై అరెస్టులు, రిమాండ్‌లు అన్నీ జరిగాయని తెలిపారు. తీవ్రమైన ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఇందులో కరీంనగర్‌ మంత్రి హస్తం ఉందన్నారు. 
‘‘అనేక ఆరోపణలపై సిట్‌లు వేయడం.. మూసివేయడం సాధారణంగా మారింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు రాధాకిషన్‌రావు చెప్పారు. ఇందులో నేను, రేవంత్‌రెడ్డి కూడా బాధితులమే. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతోంది. నా కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లనూ ట్యాప్‌ చేశారు. ఇందులో హరీశ్‌రావు కూడా బాధితుడే. 317జీవో, టీఎస్‌పీఎస్సీ సమయంలో నన్ను అరెస్టు చేయడానికి కారణం ఫోన్ ట్యాపింగ్. దీంతో కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధం ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు ప్రజల ముందు వాస్తవాలను పెట్టడం లేదు. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలి. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలి. సీబీఐకి ఇవ్వకపోతే ఈ కుంభకోణంతో హస్తం పార్టీకి సంబంధం ఉన్నట్లే’’ అని బండి సంజయ్‌ అన్నారు.

Post a Comment

Previous Post Next Post