ట్రాన్స్ జెండర్స్ ఉపాధికి బాటలు: పెద్దూర్ అపెరల్ పార్క్ వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ప్రణాళికలు

ఆర్థిక స్వావలంబన.. స్వయం అభివృద్దికి శ్రీకారం

ట్రాన్స్ జెండర్స్ ఉపాధికి బాటలు

గత 6 మాసాల క్రితమే ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన మరియు ప్రతిపాదనలకు శ్రీకారం

త్వరలో పెట్రోల్ పంప్ ఏర్పాటుకు చర్యలు


సిరిసిల్ల, మే 26, 2024: రాష్ట్రంలోనే ప్రపథమంగా ట్రాన్స్ జెండర్ల ఆర్థిక స్వావలంబన.. స్వయం అభివృద్దికి ప్రభుత్వం జనవరిలో ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. ఆత్మవిశ్వాసం తో ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్రోల్ పంప్ త్వరలో ఏర్పాటు కానుంది.

జిల్లాలోని ట్రాన్స్ జెండర్ లకు మంచి అవకాశాలు అందించేందుకు పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అనంతరం ఫీబ్రవరి మాసంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టితో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

వీ-హబ్ తో ఒప్పందం..
ట్రాన్స్ జెండర్లకు సమాన అవకాశాల చట్టం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు వారి సంక్షేమానికి కృషి చేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 25 మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. వారి స్వయం ఉపాధి కోసం వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు వీ-హబ్ తో ఒప్పందం చేసుకోవడం జరుగుతున్నది. 

పెట్రోల్ పంప్ ఏర్పాటుకు ఎన్.ఓ.సీ..

ట్రాన్స్ జెండర్లు సమాజంలో మంచి అవకాశాలతో జీవించేందుకు.. అలాగే పునరావాసం కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక పెట్రోల్ పంపు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్.ఓ.సీ) ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు ఇక్కడ పెట్రోల్ పంప్ ను మంజూరు చేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం రెండో బైపాస్ లోని వైద్య కళాశాల ఎదురుగా ఉన్న వి.వింగ్ పార్కులో వీటికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యవేక్షణలో కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి. 

రూ. మూడు కోట్ల వ్యయం..

పెట్రోల్ పంపును దాదాపు రూ. మూడు కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నారు. దీని నిర్మాణంతో ఈ పంప్ లో 15 మంది ట్రాన్స్ జెండర్ల కు ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, మరో పదిమందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని ట్రాన్స్ జెండర్ల కు అదనపు కలెక్టర్ (స్తానిక సంస్థలు) పూజారి గౌతమి అవగాహన కార్యక్రమాలను ఇటివల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. పెట్రోల్ పంప్ నిర్వహణ పై ట్రాన్స్ జెండర్ల కు త్వరలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి (నోడల్ ఆఫీసర్) లక్ష్మీరాజం ప్రణాళిక రూపొందిస్తున్నారు.

శాశ్వత ఉపాధికి మార్గం: బీ. మధుషా, సిరిసిల్ల
జిల్లా అధికారులు మాకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ పంప్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఇటివల సమావేశం నిర్వహించారు. మాకు శాశ్వతంగా పని దొరుకుతుంది. ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుంది. దీనిని సద్వినియోగం చేసుకుంటాం. 

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తాం..

- పీ సుప్రియ, సిరిసిల్ల
- ఇండియన్ ఆయిల్ కంపెనీ ఆద్వర్యంలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయడంతో మేము ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంచి అవకాశం వచ్చింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. మిగితా ట్రాన్స్ జెండర్ల కు మేము మార్గదర్శకులుగా నిలుస్తాం.

చట్టం స్ఫూర్తితో ముందుకు వెళదాం...

- లక్ష్మీరాజం , జిల్లా సంక్షేమ అధికారి(నోడల్ ఆఫీసర్)
 ట్రాన్స్ జెండర్ ల కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సమాన అవకాశాల చట్టం 2019 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లాలో పలు వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.. వారి జెండర్ సెన్సిటివిటీని వారు ఆశించిన విధంగా నమోదు చేయడానికి వారి లింగ మార్పిడి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం వారికి ఐడి కార్డులు ఇష్యూ చేస్తున్నాము. అలాగే వారికి శాశ్వత ఉపాధి కోసం జనవరి లో ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శకత్వం లో వారిని శిక్షణకు కూడా పంపించడం జరుగుతుంది.

Post a Comment

Previous Post Next Post