రాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు.
బుధవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు, ఖర్చుల రిజిస్టర్ ల నిర్వహణ, తదితరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 3వ తేదిన నోటిఫికేషన్ ప్రకటించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, నవంబర్ 10వ తేదీన నామినేషన్ల స్వీకరణ ముగుస్తుందని తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లను నవంబర్ 10 వ తేదీ సాయంత్రం 3:00 గంటల లోగా వేయాలన్నారు.
కార్యాలయ పని దినాల్లో నవంబర్ 3 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకూ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకూ నామినేషన్ లు స్వీకరిస్తానని చెప్పారు.
13 వ తేదీన నామినేషన్ ల స్క్రూటినీ ఉంటుందన్నారు. 15 వ తేదీన నామినేషన్ ల ఉపసంహరణ కు తుది గడువు అని చెప్పారు.
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తామని, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వేములవాడ తాసిల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థుల సౌకర్యార్థం నామినేషన్ కేంద్రాలలో హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు అభ్యర్థులు తమ నామినేషన్లను హెల్ప్ డెస్క్ లో చెక్ చేయించుకోవాలన్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్ చెట్లను దాఖలు చూసేందుకు అవకాశం ఉందన్నారు.
నామినేషన్ ల దాఖలుకు అభ్యర్థితో పాటు 5 గురికి ( 1 +4) కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు . ఫారం -6 ద్వారా సమర్పించే అఫిడవిట్ లో అన్ని ఖాళీలు పూరించాలని చెప్పారు . నామినేషన్ సమయంలో క్రిమినల్ కేసులు, కన్విక్షన్ కేసుల వివరాలు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా లో 3 సార్లు పబ్లిష్ చేయాలన్నారు. అభ్యర్థులు కొత్త ఖాతా తెరిచి దాని నుంచే చెల్లింపులు జరపాలన్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ
నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుండి కేవలం 3 వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకారం అందించాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి
తంగల్లపల్లి మండలంలో బద్దేనపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో
కౌంటింగ్ కేంద్రాలు, స్ర్టాంగ్ రూం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పి అఖిల్ మహాజన్ లు బుధవారం సంయుక్తంగా పరిశీలించారు.
స్ర్టాంగ్ రూంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు అన్ని వైపులా ఉండాలని సూచించారు.
సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఒకే చోట ఉన్నందున లే అవుట్ ప్రకారం రెండు నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కు వేరువేరుగా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ అన్నారు.
లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన భద్రతకు సంబంధించి పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు ఇచ్చారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , పోలీస్ అధికారులు పాల్గొన్నారు.