మహిళా సంఘాల సభ్యులకు ఆదర్శంగా నిలువాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మహిళలు వ్యాపారంతో స్వయం సమృద్ధి సాధించాలి
సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్ లో మహాలక్ష్మి గ్రామైక్య మహిళా సమైక్య (మెప్మా) ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని కేకే మహేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన కలెక్టర్
-------------------------------
రాజన్నసిరిసిల్ల, 01 ఆగస్టు 2025
ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘాల సభ్యులు మహిళలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ఇందిరా మహిళా శక్తి కింద సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూర్ లో మహాలక్ష్మి గ్రామైక్య మహిళా సమైక్య (మెప్మా) ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, పురుగు మందుల, విత్తనాల దుకాణాన్ని కే కే మహేందర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని, ఇటీవల పెట్రోల్ బంక్ ప్రారంభించామని తెలిపారు. త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యలో ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వ్యాపార అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం సమృద్ధి సాధించి రైతులు మద్దతుగా నిలువాలని ఆకాంక్షించారు.
రైతులు తమ పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఎరువులు విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి మద్దతు పలకాలని కోరారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ స్వరూపా రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఎనిమిదో వార్డ్ కు చెందిన పలువురు రాజకీయ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.