మెరుగైన వైద్యం అందిస్తూ...ఆరోగ్య అవగాహన కల్పించాలి: జిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సుందరయ్య నగర్ అర్బన్ పీ.హెచ్.సీ లో ఆకస్మిక తనిఖీ
సిరిసిల్ల, 29 జూలై 2025
ప్రభుత్వ దవాఖానల్లో వచ్చే రోగులకు ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్ లో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో ఆయా వార్డులు, రికార్డులు, మందులను పరిశీలించారు.
అనంతరం ఆసుపత్రికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో గల సీ.సీ. కెమెరా ఊడిపోవడం గమనించి వాటిని సరి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేయించాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. దవాఖానకు వచ్చే వారికి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని సూచించారు. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రభుత్వ వైద్య సేవలు పొందాలని సూచించారు.