అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ రాకపై సస్పెన్స్..

NASA: 8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 3 నెలలుగా అక్కడే చిక్కుకున్నారు.

 అయితే సునీతా విలియమ్స్‌ను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు అమెరికా అంతరిక్ష కేంద్రం – నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

 సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్‌మోర్ కూడా ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొన్నారు. అయితే వీరిద్దరూ ఐఎస్ఎస్‌కు బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌లో వెళ్లారు. ఆ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీ కారణంగా వారి తిరుగుయాత్రకు ఆటంకం ఏర్పడింది. అయితే వారిని మరో వ్యోమనౌకలో తిరిగి భూమి మీదికి తీసుకురావాలని నాసా యోచిస్తోంది. కానీ దానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తాజాగా ప్రకటించింది.
బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌లో సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ ఈ ఏడాది జూన్‌ 5 వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారిద్దరూ వెళ్లిన వారం రోజుల్లోగా తిరిగిరావాల్సి ఉంది. కానీ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో వారు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలోనే వారిని తీసుకురావడానికి.. బోయింగ్ కొత్త క్యాప్సూల్ సురక్షితంగా ఉందో లేదో ఈ శనివారం నిర్ణయిస్తామని.. గురువారం నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను తిరిగి తీసుకురావడానికి బోయింగ్ కొత్త క్యాప్సూల్‌ను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ మేరకు నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ శనివారం బేటీ అయి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌లతో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ అంతరిక్ష యాత్రలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం వాయువు లీకేజీ కారణంగా సమస్య తలెత్తింది. దీంతో ఆ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా గుర్తించింది. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉంది. ఈ శనివారం ఆ స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌ను పరీక్షించి అది సురక్షితం కాదని భావిస్తే ఖాళీగానే సెప్టెంబర్‌లో దాన్ని భూమి వైపు తీసుకురానున్నారు. లేని పక్షంలో వారిద్దరినీ తీసుకువచ్చేందుకు నాసా ప్రత్యేకంగా స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ను పంపాల్సి ఉంటుంది. కానీ అందుకోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే వారు వెళ్లిన స్టార్‌లైనర్‌ థ్రస్టర్లను సరిచేసేందుకు కొత్త కంప్యూటర్‌ మోడల్‌ను పరీక్షిస్తున్నట్లు నాసా ఇంజినీర్లు తెలిపారు. దాన్ని సమీక్షించిన తర్వాతే నాసా ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.

Post a Comment

Previous Post Next Post