Tirumala: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు..
అనంతరం.. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు రేవంత్రెడ్డి. తమ మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేయగా.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్రెడ్డి..
స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ''కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి'' అని రేవంత్రెడ్డి ఆకాంక్షించారు.