సిరిసిల్ల, 25 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): త్వరలో జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో చేపట్టే నామినేషన్ ప్రక్రియ పై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.
బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్ లో నామినేషన్ దాఖలు ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ లపై రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులు జిల్లా నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
మాస్టర్ ట్రైనర్లు నామినేషన్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ లపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... నామినేషన్ స్వీకరించే రోజు నుండి ప్రక్రియ ముగిసే రోజు వరకు ఉదయం 11:00 గం.ల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ దాఖలు సమయమన్నారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలన్నారు. నామినేషన్ దాఖల సమయం లో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ లో ఎలాంటి బ్లాంక్ లేకుండా చూసుకోవాలి అన్నారు. చెక్ లిస్ట్ ప్రకారం నామినేషన్ పారం అభ్యర్థులు సమర్పించేలా చూడాలన్నారు. నామినేషన్ల స్కూటీని రిటర్నింగ్ అధికారి మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు.
అనంతరం పోస్టల్ బ్యాలెట్ శిక్షణ కార్యక్రమం ను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు.
రానున్న ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు, సర్వీస్ ఓటర్లు, స్పెషల్ ఓటర్లు తో పాటు తాజాగా 13 రకాల అత్యవసర సేవల సిబ్బందికి సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశంను కేంద్రం ఎన్నికల సంఘం కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకునేలా ఎన్నికల అధికారులు అవగాహన కల్పించాలనీ చెప్పారు.
నోటిఫైడ్ ఓటర్ల జాబితా విస్తరణ
ఎన్నికల సంఘం ఈసారి నోటిఫైడ్ ఓటర్ల జాబితాను తాజాగా విస్తరించిందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ జాబితాలో ఎన్నికల విధుల కారణంగా ఓటు వేయలేకపోయే అత్యవసర సేవల ఉద్యోగులకు తాజాగా స్థానం కల్పించిందన్నారు.ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI), దూరదర్శన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), ఆల్ ఇండియా రేడియో (AIR), BSNL, భారతీయ రైల్వే, ఆర్టీసీ, విద్యుత్, ఆరోగ్యం - కుటుంబ సంక్షేమం, ఆహారం, పౌర సరఫరాలు, అగ్నిమాపక శాఖలు, కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరించే జర్నలిస్టులను ఈ విభాగంలో చేర్చారన్నారు. ఆయా సంస్థలు రిటర్నింగ్ అధికారుల ద్వారా ఉద్యోగులకు ఫారం - 12డీ ఇప్పింది, పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయాన్ని కల్పించొచ్చని ఈసీ స్పష్టం చేసిందన్నారు.
సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, గౌతమ్ రెడ్డి, ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్, డిఆర్డిఒ శ్రీనివాస్, సిపిఒ పి బి శ్రీనివాస చారి, మాస్టర్ ట్రైనర్ లు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.