
Posted by Chief Editor DAYANAND JANA
సిరిసిల్ల 09, అక్టోబర్ 2023: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్లు ఎన్. ఖీమ్యా నాయక్, గౌతమ్ రెడ్డి లు అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 83 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.