--------------------------------------------------
వచ్చే నెల 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా నామినేషన్ల స్వీకరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సిరిసిల్ల, వేములవాడలలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను సందర్శించి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శక సూత్రాల ప్రకారం నామినేషన్ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నామినేషన్ ల స్వీకరణ ప్రక్రియ ఎన్నికల నిబంధనల మేరకు పకడ్బందీగా చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధు సూదన్ లకు సూచించారు. పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో ఎన్నికల పరిశీలకుల బస ఏర్పాట్లను పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికల పరిశీలన కోసం వచ్చే వ్యయ, సాధారణ పరిశీలకుల కోసం గెస్ట్ హౌస్ ను సిద్దం చేయాలన్నారు.