జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
హాజరైన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ఉత్తమ ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంస పత్రాల అందజేత
రాజన్నసిరిసిల్ల, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్యాంప్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా అభివృద్ది పనులు, వివిధ పథకాల సందేశాన్ని కలెక్టర్ వివరించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అందజేసి, అభినందించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ప్రతిష్టాత్మక పథకాల పై సీఎం వివరణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ పై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు.